న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత బదిలీల కార్యక్రమం ఓ తరంగంలా అనూహ్యంగా దూసుకొచ్చిన నేపథ్యంలో మరో ప్రమాదం పొంచి ఉందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఈ వ్యాలెట్స్, ఆన్ లైన్ పేమెంట్స్ నేపథ్యంలో మొబైల్ ద్వారా జరిగే మోసాలు పెరిగేపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమస్య 2017నాటికి 60 నుంచి 65శాతానికి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అసోచామ్, ఈవై అనే ఓ సంస్థ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించి ‘సైబర్ నేరాలు తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా అనుసరించాల్సిన వ్యూహాలు’ అనే పేరిట ఒక నివేదికను విడుదల చేసింది.
ప్రతి ప్రాంతంలో ఎలాంటి లావాదేవీ ఆగకుండా, ఏం కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలని, సైబర్ నేరాలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘ ప్రస్తుతం 40 నుంచి 45శాతం ఆయా కంపెనీలకు చెందిన ఆర్థిక లావాదేవీలు మొబైల్ ద్వారా జరిగే మోసాలను ఎదుర్కొంటున్నాయి. ఇవి త్వరలోనే 60 నుంచి 65శాతానికి పెరుగుతాయి.
ఇప్పటి వరకు జరిగిన సైబర్నేరాల్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని, ఇవి గతంతో పోలిస్తే గడిచిన మూడేళ్లలో ఆరింతలు పెరిగాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. విడివిడిగా చూసినప్పుడు 46శాతం ఆన్ లైన్ బ్యాంకింగ్తో సంబంధం ఉన్న క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులవి ఉన్నాయని, ఫేస్ బుక్కు సంబంధించిన సైబర్ నేరాలు 36శాతం, మొబైల్ ద్వారా 21శాతం, ఈమెయిల్ ఐడీ హ్యాకింగ్ మోసాలు 18శాతం, అభ్యంతర ఫోన్ కాల్స్, మెస్సేజెస్ మోసాలు 12శాతం ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొంది.