శశికళకు షాక్‌.. బినామీ ఆస్తుల జప్తు

6 Nov, 2019 06:45 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన వీకే శశికళకు చెందిన రూ. 1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయ పన్ను శాఖ మంగళవారం స్వాధీనం చేసుకుంది. 2016 నవంబర్‌లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న తరువాత చెన్నై, పుదుచ్చెరీల్లో వేర్వేరు చోట్ల ఉన్న 9 ఆస్తులను ఆమె కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దాదాపు రూ. 1500 కోట్ల విలువైన రద్దైన నోట్లతో ఆ ఆస్తులను శశికళ బినామీ పేర్లతో కొన్నట్లు, నగదు చెల్లింపుల ద్వారానే ఆ కొనుగోలు జరిగినట్లు  నిర్ధారించారు.

అక్రమ ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరులోని జైళ్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2017లో ఐటీ అధికారులు శశికళతో పాటు ఆమె సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై భారీగా దాడులు నిర్వహించారు. చెన్నై పోయెస్‌ గార్డెన్‌ లోని జయలలిత ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆ సమయంలోనే ఈ 9 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం.  

>
మరిన్ని వార్తలు