కైరానా ఎమ్మెల్యే​ వ్యాఖ్యలతో హైరానా..

22 Jul, 2019 14:17 IST|Sakshi

లక్నో : యూపీలోని కైరానా ఎస్పీ ఎమ్మెల్యే నహిద్‌ హసన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మద్దతుదారుల దుకాణాల నుంచి ఏ వస్తువూ కొనుగోలు చేయరాదని స్ధానిక ముస్లింలకు ఎమ్మెల్యే పిలుపు ఇవ్వడం కలకలం రేపింది. ముస్లింలు ఈ షాపుల నుంచి సరుకులు కొనుగోలు చేయడం వల్లే బీజేపీ మద్దతుదారులైన వీరు బతుకుతున్నారని ఆ వీడియోలో ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం. కైరానాతో పాటు పరిసర గ్రామాల్లోని ముస్లింలు స్ధానిక బీజేపీ మద్దతుదారుల దుకాణాల్లో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయరాదని, పది రోజుల నుంచి నెలరోజుల పాటు ఇలా చేస్తే పరిస్ధితిలో మార్పు వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వేరే గ్రామాలకు లేదా ఎక్కడికైనా వెళ్లి అవసరమైన సరుకులు తెచ్చుకుని మీ సోదరులకు సంఘీభావం తెలిపేందుకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తప్పులేదని ఆయన చెప్పుకొచ్చారు. మార్కెట్‌లో బీజేపీ సానుభూతిపరులైన వ్యాపారులను బహిష్కరించండి. ‘వారి నుంచి మీరు సరుకులు కొనడం వల్లే వాళ్ల ఇళ్లు నడుస్తున్నాయి..మన వైఖరి వల్లనే మనం ఇబ్బందులు పడుతున్నామ’ని ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింల కారణంగా కైరానాలో హిందువులు వలస వెళుతున్నారని కొన్నేళ్ల కిందట ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు