‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’

16 Jul, 2020 14:58 IST|Sakshi

బెంగళూరు : కరోనా నుంచి ఆ దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలడని కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల 100 శాతంగా ఉందని, వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం నిబంధనలు పాటించాలని తెలిపారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మనమందరం అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ సభ్యులు, ప్రతిపక్షం, ధనవంతులు, పేదవారు, పోలీసులు, వైద్యులు అంటూ వైరస్ వివక్ష చూపదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొన్నారు. (10 రోజుల చికిత్సకు రూ.9.09 లక్షలు)

అయితే ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నయన్న ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. కర్ణాటక ప్రభుత్వం కొవిడ్‌-19పై అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని.. మంత్రుల నిర్లక్ష్యం వల్లనో, లేక అధికారులు, మంత్రుల మధ్య సమన్వయలోపం వల్లనో జరగడం లేదన్నారు. అలాగే దేవుడు మాత్రమే మనల్ని కరోనా నుండి రక్షించగలడని పేర్కొన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షం విరుచుకుపడుతోంది. దేవుడే కాపాడాలని మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసమర్థకు నిదర్శమని కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. వైరస్‌ను పరిష్కరించలేకపోతే ఇలాంటి ప్రభుత్వం తమకు అవసరమా అని నిలదీశారు. (ఇతనికి అవేమి పట్టవు.. ఏకంగా 163 సార్లు)

అయితే విమర్శలపై స్పందించిన శ్రీరాములు అనంతరం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజల సహకారంతోపాటు దేవుడు దయ కూడా మనకు కావాలని తాను చెప్పినట్లు వెల్లడించారు. తన మాటలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చిత్రీకరించి ప్రసారం చేశాయని బుధవారం రాత్రి వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో 47,253 మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 928 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 2.75 లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు 1.51 లక్షలు, ఢిల్లీ 1.16 లక్షల కేసులతో మూడో స్థానంలో ఉంది. (మంత్రి భార్య, కుమారుడికి పాజిటివ్‌)

>
మరిన్ని వార్తలు