మిషన్‌ కశ్మీర్‌.. కేంద్రం వ్యూహం ఫలిస్తోందా?

11 Dec, 2017 10:00 IST|Sakshi

శ్రీనగర్‌ : కశ్మీర్‌ అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్‌ శర్మ చర్చలు వేర్పాటువాదుల్లో చీలిక తీసుకొస్తున్నాయి. తొలుత కొన్ని వేర్పాటువాద సంస్థలు ఆయనతో చర్చకు అంగీకరించని విషయం తెలిసిందే. అయితే ముస్లిం కాన్ఫరెన్స్‌ ప్రతినిధి అబ్దుల్‌ ఘని భట్‌ ఇప్పుడు దినేశ్వర్‌తో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. 

ఒకప్పుడు హురియత్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన అబ్దుల్‌..  తర్వాత సొంతగా ముస్లిం కాన్ఫరెన్స్‌(ఎంసీ) సంస్థ ఏర్పాటు చేసుకుని కశ్మీర్‌లో వేర్పాటువాద ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రత్యేక ప్రతినిధి తో రహస్య సమావేశం అయిన వార్తల నేపథ్యంలో ఎంసీ ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. అనంతరం అబ్దుల్‌ను సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్లు ముస్లిం కాన్ఫరెన్స్‌ ప్రకటించింది. ఇక మహ్మద్‌ సుల్తాన్‌ను కొత్త చీఫ్‌గా ఎంసీ ప్రకటించింది. తొలుత ఓ జాతీయ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భేటీ వార్తలను అంగీకరించిన అబ్దుల్‌.. వేటు తర్వాత అదంతా అబద్ధమని చెబుతున్నారు. కొందరు కక్ష్య కట్టి తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. 

అబ్దుల్‌ ఘని భట్‌ ఫోటో

ఇక కశ్మీర్ విషయంలో చర్చల కోసం కేంద్రం ఐబీ మాజీ చీఫ్‌ దినేశ్వర్‌ శర్మను నియమించిన రెండు నెలల్లోనే వేర్పాటు వాద సంస్థల్లో చీలికలు రావటం విశేషం. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని సంస్థలు స్వాగతించగా.. పాక్‌ ప్రేరేపిత సంస్థల్లో మాత్రం విభేదాలతో చీలికలు వస్తుండటం గమనార్హం.
 

మరిన్ని వార్తలు