సాక్షి, తిరువనంతపురం : మహిళ జీన్స్ ధరిస్తే వారి పిల్లలు ట్రాన్స్జెండర్ అవుతారని ఓ కేరళ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లో ఆటిజానికి కూడా వారి తల్లులు పురుషుల్లా వ్యవహరించడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజత్ అనే అధ్యాపకుడు పిల్లలు ట్రాన్స్జెండర్లుగా మారడానికి, అటిజంతో బాధపడటానికి వారి తల్లితండ్రులే బాధ్యులవుతున్నారని వ్యాఖ్యానించారు.
మహిళ ఎప్పుడైతే తన స్త్రీత్వాన్ని, పురుషుడు తన పురుషత్వాన్ని దిగజార్చుతారో వారికి పుట్టే బాలిక మగవాడి లక్షణాలను అందిపుచ్చుకుంటుందని, అలాంటి మహిళకు జన్మించిన బిడ్డ ట్రాన్స్జెండర్ అవుతారని అన్నారు. కాలడిలోని ఓ ప్రభుత్వ కళాశాలలో అథ్యాపకుడైన రజత్ కుమార్ చేసిన అశాస్ర్తీయ, లైంగిక వివక్ష వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. మహిళలపై ఆయన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాలు, పౌరసమాజం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రజత్ వ్యాఖ్యలపై కలకలం రేగడంతో ఆయనను తమ కార్యక్రమాలకు ఆహ్వానించరాదని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలను కోరుతూ కేరళ విద్యా మంత్రి కేకే శైలజ ప్రకటన జారీ చేశారు. గతంలోనూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్లో రజత్ ప్రసంగాలకు సంబంధించిన వీడియో క్లిప్లున్నాయి.