‘112’ అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది

4 Dec, 2019 01:51 IST|Sakshi

కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: 112 నంబర్‌ ఆధారిత అత్యవసర స్పందన వ్యవస్థ పశ్చిమ బెంగాల్‌ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘ఆపదలో ఉన్న వ్యక్తి 112ని ఆశ్రయిస్తే తక్షణం సహాయం అందుతుంది. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ చేసుకోవాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది, లేదా వలంటీర్లు ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షిస్తారు. ఆపదలో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నారు? ఎంత దూరంలో ఉన్నారు? వంటి వివరాలతో సమీప పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందుతుంది. 112 నెంబర్‌ యాప్‌ అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలకు నిధులు కూడా సమకూర్చాం. బెంగాల్‌ మినహా మిగతా 27 రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది.’అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు