మొబైల్‌ఫోన్‌, ల్యాండ్‌లైన్‌ సేవలు రీస్టార్ట్‌!

10 Aug, 2019 16:40 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం

శ్రీనగర్‌: ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌, లదాఖ్‌ విభజన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించి.. నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో, ముఖ్యంగా కశ్మీర్‌ లోయలో 144 సెక్షన్‌ అమల్లో ఉంచి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, భారీ నిరసనలు జరగకుండా ముందజాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. కేంద్రం నిర్ణయాల నేపథ్యంలో భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్‌ లోయలో జనజీవనం పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ముఖ్యంగా మొబైల్‌ ఫోన్‌, ల్యాండ్‌లైన్‌ సేవలు నిలిపేయడం, ఇంటర్నెట్‌ సేవలను సస్పెండ్‌ చేయడంతో బయటి ప్రపంచానికి కశ్మీర్‌తో దాదాపుగా సంబంధాలు తెగిపోయాయి. దీంతో లోయలోని తమ వారి యోగక్షేమాలు తెలియక బయట ఉన్న కశ్మీరీలు ఆందోళన చెందుతుండగా.. బయట ఏం జరుగుతుందో తెలియ లోయ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజనపై కశ్మీర్‌లో పెద్దగా నిరసనలు.. అలజడి చెలరేగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తోంది. శనివారం సాయంత్రం కల్లా జమ్మూకశ్మీర్‌లో మొబైల్‌ ఫోన్‌ వాయిస్‌ కాల్‌ సేవలు, లాండ్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా 144 సెక్షన్‌ అమలులోనూ సడలింపులు ఇచ్చే అవకాశముంది. ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణకు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు