పాస్‌పోర్ట్‌ నిబంధనల్ని మార్చండి

1 Jan, 2019 04:25 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్డు సూచన

చెన్నై: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్న వారు దేశం విడిచి పారిపోకుండా పాస్‌పోర్టు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మద్రాస్‌ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తనను విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ మంగళం అనే అంగన్‌వాడీ కార్యకర్త వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా స్పందించింది. ‘రుణ ఎగవేత దారులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సుదూర దేశాలకు పారిపోతున్నారు. వారు తమ పాస్‌పోర్టులను రుణం పొందిన బ్యాంకు లేదా సంస్థ వద్ద సరెండర్‌ చేసేలా నిబంధనలు మార్చాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

రుణం పూర్తిగా చెల్లించేవరకు రుణదాత వద్దే పాస్‌పోర్టు ఉండాలి. ఉంచకపోతే పాస్‌పోర్టు తాత్కాలికంగా రద్దుచేయాలని, పాస్‌పోర్టు రెన్యూవల్‌కు కోర్టు అనుమతి ఉండాలని తెలిపింది. మంగళం అనే అంగన్‌వాడీ కార్యకర్త..అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తన బంధువు పాస్‌పోర్టుతో సింగపూర్‌ వెళ్లడంతో ప్రభుత్వం ఆమెను విధుల నుంచి తొలగించడంపై కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆమెను మందలిస్తూ వారం రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. మంగళంతోపాటు ఆమె బంధువుకు రేషన్‌కార్డు తదితర ప్రభుత్వ సౌకర్యాలను ఉపసంహరించాలంది.

మరిన్ని వార్తలు