21 ఏళ్లకే జడ్జిగా మయాంక్‌ ప్రతాప్‌ సింగ్‌!

22 Nov, 2019 12:10 IST|Sakshi

జైపూర్‌ : అత్యంత పిన్న వయస్సులోనే జడ్జిగా పనిచేసే అవకాశం దక్కించుకున్న తొలి వ్యక్తిగా మయాంక్‌ ప్రతాప్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన అతడు‌.. 21 ఏళ్ల వయస్సులోనే అరుదైన ఘనత సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఎల్‌ఎల్‌బీ ఫైనల్‌ ఇయర్‌లోనే జడ్జిగా ఎంపికై చరిత్ర పుటల్లో నిలిచాడు. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేందుకు కనీస వయస్సును 23 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజస్తాన్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మయాంక్‌కు ఈ అవకాశం లభించింది. ఈ క్రమంలో రాజస్తాన్‌ జుడిషియల్‌ సర్వీస్‌-  2018 పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన మయాంక్‌ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు.

వారందరికీ ధన్యవాదాలు..
‘సమాజంలో న్యాయ వ్యవస్థకు, న్యాయవాదులు, న్యాయమూర్తులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. 2014లో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో జాయిన్‌ అయ్యాను. రాజస్తాన్‌ యూనివర్సిటీ నుంచి ఈ ఏడాది పట్టా పుచ్చుకున్నా. జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో నా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉంది. వారందరికీ నా ధన్యవాదాలు. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించినందుకు గర్వంగా ఉంది. రాజస్తాన్‌ హైకోర్టు కనీస వయసు అర్హతను తగ్గించడంతోనే ఇది సాధ్యమైంది. చిన్న వయస్సులోనే జడ్జిగా కెరీర్‌ ఆరంభిస్తున్న కారణంగా సమాజానికి సుదీర్ఘ కాలంపాటు సేవ చేసే భాగ్యం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది అని మయాంక్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు