భోపాల్ : మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి పీసీ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్న రాష్ట్రంలో రహదారుల పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎంపీ, బాలీవుడ్ డ్రీమ్గర్ల్ హేమ మాలిని బుగ్గల్లా తీర్చిదిద్దుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రజాపనుల మంత్రి సజ్జన్ వర్మతో కలిసి శర్మ రహదారుల పరిస్థితిని సమీక్షిస్తూ మధ్యప్రదేశ్లో రోడ్లు విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయని వాటికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్లో రోడ్లు వాషింగ్టన్ రోడ్ల కంటే మెరుగ్గా ఉన్నాయని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రెండేళ్ల కిందట చేసిన ప్రకటనను మంత్రి శర్మ ఎద్దేవా చేశారు. వాషింగ్టన్ తరహాలో మధ్యప్రదేశ్లో రోడ్లను నిర్మిస్తే వాటి పరిస్థితి భారీ వర్షం కురిస్తే ఎక్కడికక్కడ గుంతలు పడి అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు. ఈ రోడ్లను 15 రోజుల్లో మరమ్మత్తు చేసి హేమమాలిని బుగ్గల్లా మెరిపిస్తామని చెప్పారు.