న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తొలిసారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో దీపావళి పర్వదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మీడియాతో ముచ్చటించారు.
'మీడియాకు దూరంగా ఉంటున్నాననే ఫిర్యాదులు వస్తున్నాయి. మనం గతంలో పలుమార్లు కలుసుకున్నాం. నేను మీతో మాట్లాడాను. కానీ ప్రస్తుతం వేరు. పరిస్థితులు మారాయి. అందుకే మిమ్మల్ని కలవలేకపోయా(మీడియాను ఉద్దేశించి)'అని మోదీ చెప్పారు. పెన్నులు, పేపర్లు, కెమెరాలు లేకుండా మీడియా మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
స్వచ్ఛభారత్ ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టిన మీడియాకు మోదీ కృతజ్ఞతలు చెప్పారు. గత కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అయినా స్వచ్చభారత్ గురించి మీడియా ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదు. ఇది ఆనందించే విషయం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్కు మద్ధతిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మోదీ వెంట అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు ఉన్నారు.