నిర్భయ కేసు: ఆ మైనర్‌ ఇప్పుడెక్కడా?!

20 Mar, 2020 14:32 IST|Sakshi
వృత్తంలో నిర్భయ దోషి (మైనర్‌)

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. ఢిల్లీలోని తీహార్‌ సెంట్రల్‌ జైలులో జైలు నెంబర్‌ 3లో ఈరోజు ఉదయం 5:30 గంటలకు వారిని ఉరితీశారు. 2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో మెడికల్‌ స్టూడెంట్‌ నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగిక దాడి చేసి.. అతి కిరాతకంగా చంపేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్‌ సింగ్‌ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో వ్యక్తి మైనర్‌ అని తేలింది. దీంతో అతనికి జువైనల్‌ యాక్ట్‌ కింద జైలు శిక్ష విధించి విడుదల చేశారు. ప్రస్తుతం అతను దక్షిణ భారత దేశంలో.. రహస్య జీవితాన్ని​ గడుపుతున్నట్టు తెలిసింది.
(చదవండి: నిర్భయ దోషులకు ఉరి అమలుపై మోదీ)

ఢిల్లీకి 220 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ గ్రామానికి చెందిన సదరు మైనర్‌కు బ‌స్సు ఓన‌ర్ రామ్ సింగ్‌.. క్లీన‌ర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. 11 ఏళ్ల‌కే ఇళ్లు వ‌దిలి వ‌చ్చిన ఆ మైన‌ర్‌ను రామ్ సింగ్ చేర‌దీశాడు. నిర్భయ ఘటన సమయంలో మైనర్‌ కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడని నిరూపణ అయింది. రేప్ కేసులో దోషిగా తేలిన మైన‌ర్‌ను కొన్నాళ్లు జైలులో ఉంచారు. ఆ త‌ర్వాత అత‌న్ని రిలీజ్ చేశారు. అయితే, అతన్ని ఢిల్లీకి దూరంగా పంపేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక ఎప్పుడూ అత‌ని ముఖాన్ని క‌ప్పిఉంచడం వ‌ల్ల ఆ మైన‌ర్‌ను ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేరు. అత‌ని ఆన‌వాళ్లు ఎవ‌రికీ తెలియ‌దు. ప్ర‌స్తుతం ద‌క్షిణ భార‌త‌దేశంలో అత‌ను ఓ వంట‌వాడిగా జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్లు సమాచారం. అత‌నిపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉంటుంది.
(చదవండి: నిర్భయ కేసు: 30 నిమిషాలపాటు ఉరి తీశాం!)

మరిన్ని వార్తలు