రాజకీయ పార్టీలతో ఈసీ కీలక భేటీ

27 Aug, 2018 11:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్‌ సోమవారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ఏడు జాతీయ పార్టీలు, 51 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు హాజరయ్యాయి. సవరించిన ఓటర్ల జాబితా, ఎన్నికల వ్యయంపై పరిమితులు, వార్షిక నివేదికల దాఖలు వంటి పలు అంశాలపై ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపనుంది.

మరోవైపు రాబోయే ఎన్నికల్లో ఈవీఎంల స్ధానంలో బ్యాలెట్‌ పేపర్లు ఉపయోగించాలని పలు విపక్ష పార్టీలు ఈసీని డిమాండ్‌ చేయనున్నాయి. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షం శివసేన సహా 17 పార్టీలు బ్యాలెట్‌ పేపర్లపై ఎన్నికలు నిర్వహించాలని పట్టుపట్టనున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాం‍గ్రెస్‌, బీఎస్పీ, జనతాదళ్‌-సెక్యులర్‌, వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం,  కేరళ కాంగ్రెస్‌ (ఎం), ఆల్‌ఇండియా యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌లు ఈ డిమాండ్‌ను ముందుకుతెస్తున్నాయి. ఈ భేటీలో జమిలి ఎన్నికల అంశం అజెండాలో లేకపోయినా రాజకీయ పార్టీలు ఈ అంశం ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటికే లా కమిషన్‌కు వివిధ రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాలను నివేదించాయి.

మరిన్ని వార్తలు