మమ్మల్నీ తనిఖీ చేయండి

31 May, 2014 02:04 IST|Sakshi

* ఎస్పీజీ డెరైక్టర్‌కు ప్రియాంకా గాంధీ లేఖ
 
 న్యూఢిల్లీ:
విమానాశ్రయాల వద్ద తనకు, తన భర్త రాబర్ట్ వాద్రా, పిల్లలకు తనిఖీల నుంచి కల్పిస్తున్న మినహాయింపును ఉపసంహరించుకోవాలంటూ శుక్రవారం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) డెరైక్టర్‌కు ప్రియాంకా గాంధీ లేఖ రాశారు. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు విమానాశ్రయాల వద్ద ప్రత్యేక భద్రతను నిరాకరించే అవకాశం ఉందంటూ పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు పరోక్షంగా సంకేతాలిచ్చిన ఒకరోజు తర్వాత ప్రియాంక ఈ లేఖ రాయడం గమనార్హం.
 
దీనిపై ఎస్పీజీ వర్గాలు స్పందిస్తూ.. భద్రత ఉపసంహరణ అనేది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ఆధారంగా జరుగుతుందని తెలిపాయి. తాము ఎలాంటి విజ్ఞప్తి చేయకుండానే ఇంతకుముందున్న ఎస్పీజీ/ఢిల్లీ పోలీసులు తమను విమానాశ్రయాల వద్ద తనిఖీల నుంచి మినహాయించారని ప్రియాంక తన లేఖలో పేర్కొన్నారు.

తనిఖీల నుంచి తన భర్తకు మినహాయింపునివ్వరాదని ప్రభుత్వం భావిస్తే.. మేమందరం కలిసి వెళుతున్నప్పుడు తనకు, తన పిల్లలకు మాత్రమే మినహాయింపునివ్వడం సరికాదని తాను భావిస్తున్నానన్నారు. అయితే రాబర్ట్ వాద్రాను వీఐపీ లిస్టులో ఉంచటాన్ని రాజకీయం చేయరాదని కాంగ్రెస్ ప్రతినిధి శశి థరూర్ వ్యాఖ్యానించారు. వాద్రాకు భద్రతాపరమైన మినహాయింపులను సమీక్షిస్తామని మంత్రి అశోక్ గజపతి రాజు పరోక్షంగా అన్నారు.

మరిన్ని వార్తలు