ప్రధాని మోదీకి శాంతి పురస్కారం

24 Oct, 2018 12:26 IST|Sakshi

2018-సియోల్‌ శాంతి పురస్కారం ప్రకటించిన కొరియా

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణకొరియా ప్రతిష్టాత్మక సియోల్‌ శాంతి పురస్కరాన్ని ప్రకటించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్‌ తెలిపారు. అంతర్జాతీయ సహకారం, అభివృద్ధిలో కృషి చేసినందుకు 2018 ఏడాదికి గాను ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. ఈమేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. భారత్‌ను అభివృద్ధి బాట పట్టించిన మోదీ..  ప్రపంచ శాంతికై పనిచేశారనీ, భారత్‌లో మానవ వనరుల అభివృద్ధితో ‘మోదినామిక్స్‌’ చేశారని సియోల్‌ శాంతి పురస్కార కమిటీ వెల్లడించినట్లు రవీష్‌ తెలిపారు. ప్రధాని సియోల్‌ శాంతి పురస్కారాన్ని అందుకోబోయే తేదీ త్వరలో వెల్లడిస్తామని అన్నారు.

ఇదిలా ఉండగా.. భారత్‌లో అవినీతి కట్టడికి ప్రధాని మోదీ కృషి చేశారనీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని అవార్డు కమిటీ తెలిపింది. 1990లో 24వ ఒలింపిక్‌ క్రీడలను సియోల్‌లో విజయవంతంగా నిర్వహించిన దానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ అవార్డు అందుకోనున్న పద్నాలుగో వ్యక్తి మోదీ. ఆయనకంటే ముందు యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ కోఫి అన్నన్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మోర్కెల్‌ వంటి ప్రముఖులకు ఈ అవార్డు ఇచ్చారు. కాగా, సియోల్‌ శాంతి పురస్కారం ప్రకటించడం పట్ల చాలా ఆనందంగా ఉందని మోదీ తెలిపారు. దక్షిణకొరియాతో భారత్‌కు ఉన్న మెరుగైన భాగస్వామ్య ఒప్పందాల వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు.

మరిన్ని వార్తలు