సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సినీ నటుడు ప్రకాశ్ రాజ్కు బాలీవుడ్ ఆఫర్లు రావాట్లేదంటా. మోదీని ప్రశ్నించటమే కారణం అంటూ శనివారం మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నేను ఎప్పుడైతే మాట్లాడం మొదలు పెట్టానో.. బీజేపీ పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వాన్ని నిలదీయడం ప్రారంభించానో అప్పటినుంచి నాకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడం ఆగిపోయాయని అన్నారు. అయినా తనకేం పర్వలేదని తెలిపారు. ప్రముఖ జర్నలిస్టు, ‘లంకేశ్ పత్రికె’ సంపాదకురాలు గౌరీ లంకేశ్ హత్య తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
కేవలం ప్రశ్నించినందుకే ఆమెను చంపేశారని, ఆమె హత్య తర్వాత కూడా మౌనంగా ఉంటే అర్థం లేదని అన్నారు. ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తన ప్రశ్నాస్త్రారాలను సంధిస్నున్నారు. ‘జస్ట్ ఆస్కింగ్’ పేరుతో మేధో వర్గాన్ని ఒక తాటిపైకి తేచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్లో ఆఫర్లు లేకున్నా టాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇతర సిని పరిశ్రమల్లో ప్రకాశ్ రాజ్కు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. తాజా సూపర్ హిట్లుగా నిలిచిన రెండు తెలుగు చిత్రాలు ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ లలో ఆయన నటించిన విషయం తెలిసిందే.