బైక్‌ను తన్నిన పోలీసు.. గర్భిణి మృతి

9 Mar, 2018 02:17 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: హెల్మెట్‌ చెకింగ్‌ కోసం ఆగకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తి బైక్‌ను ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంబడించి కాలితో తన్నడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ గర్భిణి మరణించింది. బైక్‌ నడుపుతున్న ఆమె భర్తకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో జరిగింది. తిరుచ్చిరాపల్లిలోని తువకూడీ టోల్‌ప్లాజా సమీపంలో ట్రాఫిక్‌ పోలీసులు బుధవారం హెల్మెట్‌ చెకింగ్‌ నిర్వహించారు. హెల్మెట్‌ ధరించకుండా భార్యతో కలసి బైక్‌పై బయలుదేరిన రాజాను ఆపడానికి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కామరాజ్‌ యత్నించారు. కానీ రాజా బైక్‌ను ఆపలేదు.

వెంటనే మరో బైక్‌పై వెంబడించిన కామరాజ్‌.. తిరుచ్చిరాపల్లి–తంజావూరు హైవేపై రాజా బైక్‌ను కాలితో తన్నారు. దీంతో బైక్‌పై ఉన్న దంపతులిద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల గర్భిణి ఉషాను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై  పోలీసులు కామరాజ్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఉషా మృతికి సంతాపం తెలిపిన సీఎం పళనిస్వామి.. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఉష కుటుంబానికి రూ.రెండు లక్షల ఆర్థిక సాయాన్ని మక్కల్‌ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు