ఉజ్జయిని శివాలయంలో రాహుల్‌ పూజలు

29 Oct, 2018 15:28 IST|Sakshi

సాక్షి, ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సోమవారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర ఆలయంలో​ కాంగ్రెస్‌ చీఫ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల పాటు సాగే ప్రచారానికి ముందు రాహుల్‌ ఆలయ సందర్శన చేపట్టారు. గతంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా మధ్యప్రదేశ్‌ సీఎం చేపట్టిన జనాశీర్వాద్‌ యాత్ర ప్రారంభించే ముందు ఈ ఏడాది జులై 14న ఉజ్జయిని ఆలయం సందర్శించారు.

అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాహుల్‌ గాంధీ హిందుత్వ కార్డును ప్రయోగించేందుకే ఆలయాల చుట్టూ తిరుగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్‌ శివభక్తుడని, ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్‌ బదులిస్తోంది.

కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీ జబువ, ఇండోర్‌, దర్‌, ఖర్గోన్‌, మోలో జరిగే ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోర్‌లో జరిగే రోడ్‌షోలోనూ పాల్గొంటారు. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మరిన్ని వార్తలు