ముంబై: మాఫియా డాన్, ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అబూ సలేంను ముంబై స్పెషల్ కోర్టు ఒక హత్యకేసులో దోషిగా నిర్ధారించింది. 1995లో ప్రదీప్ జైన్ అనే వ్యాపారిని సలేం కాల్చి చంపాడు. ప్రదీప్ జైన్ పెద్ద మొత్తంలో నగదు ఇవ్వడానికి నిరాకరించినందువల్లే ఈ హత్య చేసినట్టు పోలీసుల ఆరోపణ.
అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుడిని 2005లో పోర్చుగల్ లో అదుపులోకి తీసుకున్నప్పటినుంచి అబూ, మరో ఇద్దరు ఆర్ధర్రోడ్ జైల్లో ఉన్నారు. ఆ తరువాత ఇదే మొదటి తీర్పు. సెక్షన్ 302, 120బి సెక్షన్ ప్రకారం అబూ సలేంతో పాటు మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు. ఈ కేసులో నయీమ్, రియాజ్ సిద్ధిఖ్ అప్రూవర్లుగా మారారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత ఎట్టకేలకు తన ముంబై కోర్టు తీర్పును వెలువరించింది.