చిట్కాలు చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు!

20 Feb, 2020 10:07 IST|Sakshi

లక్నో: ‘చాలెంజ్‌ చేసి చెబుతున్నా.. నా విద్యార్థులు ఒక్కరు కూడా పరీక్షల్లో ఫెయిల్‌ అవ్వరు. ఎలాగైనా వారు పాసైపోతారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే జవాబుపత్రంలో ఓ వంద రూపాయలు ఉంచండి’ అంటూ పరీక్షల్లో ఎలా కాపీ కొట్టాలో చెబుతూ ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ అడ్డంగా బుక్కయ్యాడు. అతడి ‘ప్రసంగాన్ని’  ఓ విద్యార్థి చిత్రీకరించగా.. వీడియో ఆధారంగా పోలీసులు సదరు ప్రిన్సిపల్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... రాష్ట్రంలో మంగళవారం నుంచి యూపీఎస్‌ఈబీ(బోర్డ్‌ ఎగ్జామ్స్‌) పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మావో జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం... తమ విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా సమావేశానికి ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో పాఠశాల ప్రిన్సిపల్‌, మేనేజర్‌ ప్రవీణ్‌ మాల్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్‌ సెంటర్‌లో మీరు భయపడా​ల్సిన పనిలేదు. పరీక్ష రాసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. కానీ ఎదుటి వారి చేతులు తాకొద్దు. ఒకవేళ మాట్లాడుకుంటూ దొరికిపోయినా అస్సలు భయపడవద్దు. రెండు చెంపదెబ్బలు వేసినా భరించాలి. ముఖ్యంగా సమాధాన పత్రాన్ని ఖాళీగా ఉంచకూడదు. వీలైతే అందులో ఓ వంద రూపాయల కాగితం పెట్టండి. అప్పుడు టీచర్లు మీకు గుడ్డిగా మార్కులు వేసేస్తారు. ఇలా చేస్తే నాలుగు మార్కుల జవాబుకు కనీసం మూడు మార్కులైనా వేస్తారు’’ అంటూ విద్యార్థులకు హితబోధ చేశాడు. ఈ క్రమంలో.. ఓ విద్యార్థి ప్రిన్సిపల్‌ మాటలను రహస్యంగా రికార్డు చేశాడు. అనంతరం గ్రీవెన్స్‌ సెల్‌లో వీడియోతో సహా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్‌ మాల్‌ను అరెస్టు చేశారు.

చదవండి: బీజేపీ ఎమ్మెల్యే అకృత్యం.. కేసు నమోదు!

కాగా యూపీలో మంగళవారం నుంచి ప్రారంభమైన బోర్డ్‌ ఎగ్జామ్స్‌(పది, పన్నెండో తరగతి)కు దాదాపు 56 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈ ఏడాది మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు యోగి సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలతో మానిటరింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటుగా... సున్నితమైన ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత కూడా కల్పిస్తోంది. 75 జిలాల్లలోని 7784 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ట్విటర్‌లో ఓ అకౌంట్‌ను క్రియేట్‌ చేసింది.

మరిన్ని వార్తలు