‘నవంబర్‌ నుంచి మందిర్‌ నిర్మాణం’

15 Sep, 2019 14:29 IST|Sakshi

లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణం నవంబర్‌ నుంచి ప్రారంభమవుతుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో సాగుతున్న రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో రామాలయానికి అనుగుణంగా సర్వోన్నత న్యాయస్ధానం నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రార్ధించే హక్కు పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కన్న స్వామి దీన్ని నిరాకరించే అధికారం ఎవరికీ లేదన్నారు. రామజన్మభూమిలో రామ మందిరాన్ని ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యస్వామి తన జన్మదినం సందర్భంగా శనివారం అయోధ్యకు చేరుకున్నారు. కాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో మందిర నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే కోరిన నేపథ్యంలో బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం​గమనార్హం. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం రామ మందిర నిర్మాణానికి సమయం ఆసన్నమైందని, ఉమ్మడి పౌరస్మృతిపైనా ఓ నిర్ణయం తీసుకోవాలని ఉద్ధవ్‌ థాకరే కేంద్రాన్ని కోరారు.

మరిన్ని వార్తలు