'అది కేవలం నిక్‌నేమ్‌ మాత్రమే'

8 May, 2020 09:28 IST|Sakshi

హుగ్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజుకోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిసెంబర్‌ నుంచి మొదలుకొని 5 నెలలుగా ప్రపంచంలో కరోనా, లాక్‌డౌన్‌, ఐసోలేషన్‌, క్వారంటైన్‌ వంటి పదాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ 5 నెలల్లో ఎంతోమంది తల్లిదండ్రులు తమకు పుట్టిన బిడ్డలకు కరోనా , కోవిడ్‌ లాంటి పేర్లు పెట్టడం చూస్తున్నాం. మొన్నటికి మొన్న టెస్లా కార్ల సంస్థ సీఈవో ఎలన్‌ మస్క్‌ తన కొడుక్కి అర్థం కాని పేరు పెట్టి నెటిజన్లను కన్ప్యూజన్‌లోకి నెట్టేశారు.(కరోనా.. ఒక్క రోజులోనే 103 మంది మృతి)

తాజాగా ఈ జాబితాలోకి తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అపరూప పొద్దార్‌ చేరారు. గురువారం రాత్రి హుగ్లీ జిల్లాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అపరూప పొద్దార్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ' కరోనా సమయంలో నాకు బిడ్డ పుట్టింది కాబట్టే దానికి కరోనా అనే పేరు పెడుతున్నా. అయితే ఇది కేవలం నిక్‌నేమ్‌ మాత్రమే. నా బిడ్డకు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామకరణం చేస్తారు. నాకు బిడ్డ పుట్టడం నా భర్త షాకిర్‌ అలీకి సంతోషం కలిగించింది. ప్రస్తుతానికి నేను, నా బిడ్డ క్షమంగా ఉన్నాం' అంటూ అపరూప పొద్దార్‌ పేర్కొన్నారు. సాధారణంగా బెంగాల్‌లో అప్పుడే పుట్టిన బిడ్డలకు రెండు పేర్లు పెట్టే సంప్రదాయం కొనసాగుతుంది. తల్లిదండ్రులు తమకి నచ్చిన పేరును పెట్టుకోవచ్చు. అయితే ప్రధాన నామకరణం మాత్రం ఇంటిపెద్ద నిర్ణయించాలన్నది వారి సంప్రదాయంగా వస్తుంది.

మరిన్ని వార్తలు