భువనేశ్వర్ : ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి గంటన్నర పాటు ట్రాక్టర్ కింద నలిగి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఒరిస్సాలోని బొయిపరిగుడ సమితిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం బొయిపరిగుడ సమితి దశమంతపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు గోరా మాలి, రమేష్ మాలిలు ట్రాక్టర్ నడపుకుంటూ అక్కడి జీడిమామిడి తోటకు బయలుదేరారు. ఆ సమయంలో ఓ పెద్ద గోతిలో పడ్డ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో తండ్రీకొడుకులిద్దరూ ట్రాక్టర్ ఇంజిన్ కింద పడ్డారు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇది గమనించిన అక్కడివారు ట్రాక్టర్ క్రిందనుంచి గోరా మాలిని బయటకు తీశారు. అయితే రమేస్ మాలిని బయటకు తీయటానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటన్నర కాలం పాటు ఇంజిన్ కింద నలిగిపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రమేష్ను జేసీబీ సహాయంతో బయటకు తీశారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారు.