న్యూఢిల్లీ: ధనిక పార్లమెంట్ సభ్యులు తమ జీతభత్యాలను వదులుకొని సరికొత్త ఉద్యమానికి నాంది పలకాలని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ తీసుకోవాలని కోరారు. తద్వారా ప్రజాప్రతినిధులపై ప్రజలకు మరింత విశ్వాసం కలుగుతుందని, దేశవ్యాప్తంగా సానుకూల సంకేతం పంపినట్లవుతుందని స్పీకర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని.. ప్రజాస్వామ్యానికి ఇది హానికర పరిణామమని హెచ్చరించారు. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలన్న వరుణ్.. ఇలాంటి నిర్ణయాలు కొంతమంది ఎంపీలకు ఇబ్బంది కలిగించవచ్చన్నారు. రూ.కోటి కన్నా ఎక్కువ ఆస్తులున్న ఎంపీలు ప్రస్తుతం 449 మంది ఉన్నారని, 132 మంది ఎంపీలు తమ ఆదాయం రూ.10 కోట్లకుపైగా ఉన్నట్లు ప్రకటించారన్నారు.