దర్జా తగ్గని మాల్యా.. అక్కడా రేసు మొదలు

23 Feb, 2017 22:22 IST|Sakshi



లండన్‌: భారతదేశ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా చాలా రోజులకు కనిపించాడు. బ్రిటన్‌లోని ఫార్ములా వన్‌ రేస్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఫార్ములావన్‌ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. సెర్జియో పెరెజ్‌, ఈస్టెబాన్‌ అనే తన డ్రైవర్స్‌తో కలిసి మాల్యా దర్జాగా ఫొటోలకు పోజులిచ్చాడు. బ్రిటన్‌లో నిర్వహించే ఫార్ములా వన్‌ రేస్‌లో మాల్యాకు చెందిన సహారా ఫోర్స్‌ ఇండియా కూడా పోటీ చేస్తుంది.

దీని ప్రమోషన్‌లో భాగంగానే తన డ్రైవర్స్‌తో కలిసి మాల్యా దర్శనం ఇచ్చాడు. ఫార్ములా వన్‌ తన టీమ్‌కు చెందిన కొత్త కారును మాల్యా గురువారం సిల్వర్‌ స్టోన్‌లో ప్రారంభించనున్నాడు. దాదాపు రూ.9000కోట్లను ఆయా బ్యాంకుల్లో రుణంగా తీసుకొని ఎగ్గొట్టి బ్రిటన్‌కు మాల్యా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడిపై భారత దర్యాప్తు సంస్థలు ప్రత్యేక నిఘా పెట్టాయి.

ప్రస్తుతం బ్రిటన్‌  ప్రభుత్వంతో కూడా భారత అధికారులు చర్చలు చేపడుతున్నారు. తమ దేశంలో వేల కోట్లను ఎగ్గొట్టి మోసం చేసిన మాల్యాను తమకు అప్పగించాలని భారత్‌ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేస్తోంది. మరోపక్క, తాజాగా మాల్యా కనిపించడంతో భారత్‌ మీడియా అతడిని తిట్ల వర్షంతో ట్విట్టర్‌లో దుమ్ముదులుపుతోంది.

>
మరిన్ని వార్తలు