కుదిరిన ముహూర్తం 31న వాంఖడే స్టేడియంలో ప్రమాణస్వీకారం

27 Oct, 2014 22:31 IST|Sakshi
కుదిరిన ముహూర్తం 31న వాంఖడే స్టేడియంలో ప్రమాణస్వీకారం

కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుండడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఆ పార్టీకి చెందిన అతిరథ మహారథులంతా వాణిజ్య రాజధానికి రానున్నారు.

 సాక్షి, ముంబై: నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 31వ తేదీన బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. స్థానిక మెరీన్‌లైన్స్ ప్రాంతృంలోని వాంఖడే స్టేడియంలో బీజేపీకి చెందిన తొలి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆయనతోపాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని తెలియవచ్చింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా అతి పెద్దపార్టీగా అవతరించిన బీజేపీ... ఏ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందనే విషయంపై కొద్దిరోజులుగా ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠతకు మంగళవారం తెరపడనుంది. ఈ నెల 31వ తేదీన కొత్త ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రులంతా ప్రమాణస్వీకారం చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా అధికారంలోకి రానున్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులందరూ ప్రమాణ స్వీకారాత్సోవానికి హాజరుకానున్నట్టు తెలిసింది. తొలుత ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేస్తారని పేర్కొన్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ సౌకర్యార్ధం కారణంగా మరో రోజు వాయిదావేశారు. దేవేంద్ర ఫడ్విస్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టాలని బీజేపీకి చెందిన అనేకమంది మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు