భర్త లేచిపోయాడన్న ఆవేశంతో భార్య...

23 Apr, 2016 20:43 IST|Sakshi
భర్త లేచిపోయాడన్న ఆవేశంతో భార్య...

జైపూర్: భర్త వివాహేతర సంబంధాలతో ఆ ఇల్లాలు విసిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పిచూసినా భర్తలో మార్పురాలేదు. పైగా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న అమ్మాయితో కలిసి భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇక అంతే.. ఆ ఇల్లాలి కోపం రెట్టింపయ్యింది. ఏం చేయాలో తోచలేదు. తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి... రాజస్థాన్ లోని బన్సవారాకు చెందిన గజేంద్ర అనే వ్యక్తికి సీత అనే మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఈ క్రమంలో వారికి పప్పు(5), సుభాష్(2) సంతానం కలిగారు. కొన్నేళ్లవరకు అన్యోన్యంగా సాగింది. అయితే గత కొంతకాలం నుంచి వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి.

భర్త గజేంద్ర స్థానిక మహిళతో వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఈ విషయంలో తరచుగా భార్యాభర్తల మధ్య కొట్లాట జరిగేది. భర్తను చాలాసార్లు వారించిచూసినా ప్రయోజనం కనిపించలేదు. ఈ క్రమంలో బుధవారం గజేంద్ర, మహిళతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ మరుసటిరోజు తన ఇద్దరు చిన్నారుల్ని ఇంటి సమీపంలో ఉన్న బావిలో పడవేసి బంధువుల ఇంటికి వెళ్లింది. పిల్లల్ని చంపేశానని బంధువులకు చెప్పగా వారు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదుచేశారు. బావిలో నుంచి సుభాష్ మృతదేహాన్ని శుక్రవారం తీయగా, పెద్ద కుమారుడు పప్పు మృతదేహం నేడు లభ్యమైందని పోలీసులు తెలిపారు. గజేంద్ర, స్థానిక మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు