-

బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి

12 May, 2020 17:35 IST|Sakshi

జగిత్యాల: బతుకుదెరువు కోసం అరబ్‌ దేశం బహ్రెయిన్‌కి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవపేట్‌ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం బహ్రెయిన్‌ వెళ్లాడు. దురదృష్టవశాత్తు ఏప్రిల్‌ 14వ తేదీన గుండెపోటుతో అతను నివాసం ఉంటున్న ఇంట్లోనే మృతి చెందాడు. గంగరాజంకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం ఆధారం కోల్పోయింది. అయితే సాధారణ పరిస్థితుల్లోనే అరబ్ దేశాల్లో చనిపోయిన వారి డెడ్ బాడీ తరలింపు ఎంతో కష్టం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. లాక్‌డౌన్‌తో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడం మరింత కష్టమైంది. దీంతో బహ్రెయిన్‌లోని తోటి సన్నిహితులు మగ్గిడి  రాజేందర్‌ ఎన్నారై శాఖకు సమాచారం అందించటంతో  వెంటనే స్పందించిన ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి  మృతుడి కంపెనీ యజమాని, అధికారులతో మాట్లాడారు. కంపెనీ సహకారంతో వారు మృతదేహాన్ని ఎమిరేట్స్‌ కార్గో ప్లయిట్‌లో బహ్రెయిన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు.

అక్కడి నుంచి స్వగ్రామం రాఘవపేట్‌ వరకు ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ బహ్రెయిన్‌ వారి అధ్వర్యంలో ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం కల్పించడం జరిగింది. మృతదేహం స్వదేశానికి తీసుకురావడానికి కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌   బిగల, ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు అన్ని విధాల కృషి చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ బహ్రెయిన్‌ ప్రెసిడెంట్‌ రాధారపు సతీష్‌కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బొలిశెట్టి వెంకటేష్‌, జనరల్‌ సెక్రటరీ పుప్పాల లింబాద్రి, మగ్గిడి రాజేందర్‌, సెక్రటరీ చెన్నమనేని రాజేందర్‌ రావు, బాల్కొండ దేవన్న, ఉత్కం కిరణ్‌ కుమార్‌, ఆకుల సుధాకర్‌, బొలిశెట్టి ప్రమోద్‌, తమ్మళ్ల వెంకటేష్‌, కొత్తూరు సాయన్న, కుమ్మరి రాజుకుమార్‌, నల్ల శంకర్‌, చిన్నవేన బాజన్న, కోట నడిపి సాయన్న, ఆకులన చిన్న బుచ్చయ్య, సొన్న గంగాధర్‌, తప్పి చిన్న గంగారాం, మొహమ్మద్‌ తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

మరిన్ని వార్తలు