-

న్యాయస్థానాలు ఆడకూడని ఆట

7 Jan, 2017 02:57 IST|Sakshi
న్యాయస్థానాలు ఆడకూడని ఆట

బీసీసీఐ ఆగ్రహం రేకెత్తించేటంతటి అహంకారంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించిన మాట నిజమే. కానీ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడమంటే ఆగ్రహంతో తుపాకీ పేల్చడం లాంటిదేనని మనవి చేయాల్సి వస్తుంది.బీసీసీఐని ‘‘సంస్కరించడం’’ అనే చిక్కుముడిలోకి కోర్టు లేదా అది నియమించే కమిటీ తలదూర్చడం చేయనేకూడదు. బోర్డు నాయకత్వాన్ని మార్చాలని బలవంతపెట్టే కంటే నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తీసుకున్న చర్యల నివేదికను కోరితే సముచితమై ఉండేది.

జాతిహితం
ఈ గురువారం సాయంత్రం అయిష్టంగా నేను ఇంటి నుంచి బయల్దేరి విమానాశ్రయానికి చేరేసరికి, అప్పటికే రెండు గంటలు ఆలస్యమైన నా బెంగళూరు విమానం మరింత ఆలస్యమైంది. క్రీడా ప్రేమికులకు చిర్రెత్తించే పరిస్థితి ఇది.  అప్పుడు నేను ఆలోచిస్తున్నది కుస్తీ గురించి.. దంగల్‌ సినిమా లోని కుస్తీ గురించి కాదు... నిజం కుస్తీ గురించి. అప్పుడే నేను సోఫియా మాటిసన్‌ చేతిలో బబితా పోగట్‌ ఓడిపోవడం చూశాను. కిక్కిరిసిన ప్రేక్షకు లంతా పోగట్‌ను ప్రోత్సహిస్తున్నా, 45 సెకన్లలోనే ఆమె ఏకపక్షంగా సాగిన ఆ పోటీలో ఓడిపోయింది. ప్రపంచంలోని అత్యుత్తమ కుస్తీ వస్తాదుల్లో ఒకడు, లండన్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత తొగ్రుల్‌ అస్గరోవ్‌కు ప్రత్యర్థిగా అనా మక భారతీయుడు వికాస్‌ కుమార్‌ బరిలోకి దిగాడు. మొదటి రౌండ్‌ను వికాస్‌ 5–0తో అస్గరోవ్ కు సమర్పించుకున్నా, రెండో రౌండ్‌ను 3–2తో నెగ్గాడు. మ్యాచ్‌ను కోల్పోతేనేం, అనామక భారత వస్తాదు ప్రపంచ అత్యు త్తమ వస్తాదుతో పోటాపోటీగా తలపడ్డాడు.

అరచేతిలో క్రీడా ప్రపంచం
నేటి భారత ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ డబ్బు, ప్రతిష్టతో ముడిపడి ఉంది. ఐపీఎల్‌లో లాగా సంపన్న వ్యాపారవేత్తలు నగర, రాష్ట్ర ప్రాతిపదికపై కుస్తీ వస్తాదుల జట్లకు నేడు యజమానులు. బహుమతులు, వెలల రూపంలో డబ్బును చెల్లిస్తూ అది ప్రపంచంలోని అత్యుత్తమ స్త్రీ, పురుష కుస్తీ వస్తాదులను ఆకర్షి  స్తోంది. ఇప్పుడు చెప్పిన పోటీలో అస్గరోవ్‌ ఎన్‌సీఆర్‌ పంజాబ్‌ తరఫున, వికాస్‌ ముంబై మహారాఠి తరఫున పాల్గొన్నారు. మీరిప్పుడు అసలైన  ప్రపంచ స్థాయి కుస్తీలను (సుల్తాన్‌ సినిమాలో లాంటి చెత్తకాదు) టీవీ తెరల పైనో లేదా ఆధునిక ఇండోర్‌ స్టేడియంలలోనూ చూడొచ్చు. ముఖ్యంగా పేరు ప్రతిష్టలతో పాటూ మంచి జీవితం గడపడానికి అవసరమైన దాని కంటే ఎక్కువ సంపాదించగల భారత కుస్తీ వస్తాదులు పెరుగుతున్నారు. భారత కుస్తీ ప్రధాన రంగస్థలిపైకి ప్రవేశించింది.

ఈ సాయంత్రం మంచి కుస్తీ పోటీలు జరిగాయి బాగుంది. అయితే అసలు రాజు మాత్రం చేత రిమోట్‌ పట్టిన క్రీడా ప్రేమికుడే. అప్పుడు, అదే సమయంలో మరో స్పోర్ట్స్‌ చానల్‌లో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) పోటీల్లో తాజా భారత స్టార్‌ క్రీడా కారుడు, ప్రపంచ 15వ ర్యాంకర్‌ కిదాంబి శ్రీకాంత్, డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నంబర్‌ 2 క్రీడాకారుడు జాన్‌ ఓస్టెర్‌గార్డ్‌ జోర్గెన్‌సన్‌పై హోరాహోరీగా పోరాడి గెలిచాడు. లక్నోలోని ఆ స్టేడియం కిక్కిరిసిపోయి ఉంది. ప్రపంచం లోని అత్యుత్తమ బ్యాండ్మింటన్‌ నిపుణులంతా ఇప్పుడు నూతన బ్యాడ్మిం టన్‌ శక్తి అయిన భారత్‌లోనే ఉన్నారు.

మీరే గనుక పీబీఎల్‌ పోటీలను చూసి ఉంటే వీఐపీల తొలి వరుసలో ఉన్న  బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) అధిపతి అఖిలేష్‌ దాస్‌ను గమనించే ఉంటారు. ఆయన ఆ క్రీడను తన ఉక్కు పిడికిలితో నడుపు తున్నాడు. ఆయన రాజకీయ వేత్త, బడా విద్యా వ్యాపారవేత్త, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత బనారసీ దాస్‌ కుమారుడు. యూపీఏ–1 హయాం లో ఉక్కుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రాహుల్‌ గాంధీపై ఆగ్రహంతో కాంగ్రెస్‌ని వీడి బీఎస్‌పీలో చేరారు. ఆయన హయాంలో బీఏఐలో పలు వివా దాలు తలెత్తాయి. వాటిలో క్రీడాకారులతో రేగినవీ ఉన్నాయి. డబుల్స్‌ బ్యాడ్మింటన్‌లో ఆరితేరిన క్రీడాకారిణి, కామన్‌వెల్త్‌ స్వర్ణ పతక విజేత గుత్తా జ్వాలతో వివాదం సుప్రసిద్ధం. ఏదిఏమైనా భారత బ్యాడ్మింటన్‌ నేడున్నంత ఉత్తమంగా మునుపెన్నడూ లేదని అంగీకరించక తప్పదు. దాస్‌ చెప్పుకోద గిన బ్యాడ్మింటన్‌ ఆటగాడు ఎన్నడూ కాడు.

లోధా పరీక్షకు నిలవలేని మార్గదర్శకులు
ఇక భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ (డబ్ల్యూఎఫ్‌ఐ) బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సొంత జాగీరే అనుకోండి. తూర్పు యూపీలోని గోండా నుంచి ఆయన ఐదుసార్లు ఎంపీ. బాబ్రీ–అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నందుకు ఐపీసీ 307 సెక్షన్‌ కింద, ఆ తర్వాత టాడా కింద అరెస్టయి జైల్లో ఉన్న 16 మందిలో ఒకరిగా ఆయన ఎక్కువగా పేరు మోశారు. ఆయనకు నిజంగా కుస్తీ పోటీల్లో లభిం చిన గౌరవం ఏమైనా ఉందంటే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి రెజ్లింగ్‌ అసోసి యేషన్‌లకు నాయకత్వం వహించినందు వల్ల లభించిందే. డబ్ల్యూఎఫ్‌ఐ లేదా బీఏఐ గనుక బీసీసీఐ అయివుంటే బ్రిజ్‌ భూషణ్, అఖిలేష్‌లు లోధా కమిటీ పరీక్షకు అస్సలు నిలవలేరు. కానీ ఆ రెండు క్రీడలు వారి మార్గదర్శకత్వంలోనే అత్యుత్తమంగా రాణించాయి.

పురోగతిని సాధించిన మరి కొన్ని ఇతర క్రీడలను కూడా ఓసారి చూద్దాం. అభయ్‌ చౌతాలాను అంతర్జాతీయ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) జీవిత కాల పోషకునిగా నియమించినందుకుగానూ... ఆయన ఆ ఫెడరేషన్‌ను ‘‘సొంతం చేసేసుకున్నారు’’ అని వారం క్రితమే ఆగ్రహం వెల్లు వెత్తింది. ఆయన హయాంలోని 2007–12 మధ్యనే భారత బాక్సింగ్‌ సము న్నతంగా వర్థిల్లింది. అవినీతి ఆరోపణలపై అభయ్‌ చౌతాలా తండ్రి, సోద రుడు జైలుకు వెళ్లినప్పుడు భూపిందర్‌ హుడా నేతృత్వంలో కాంగ్రెస్‌ అధి కారంలో ఉంది. అయినా అభయ్, హుడాలు ఇద్దరూ కలసి హరియాణాను భారత బాక్సింగ్‌కే కాదు కాంటాక్ట్‌ (క్రీడాకారుల శరీరాలు తాకే) క్రీడలకే రాజధానిగా మలిచారు. హరియాణాకు చెందిన విజేందర్‌ సింగ్‌ భారత దేశపు మొదటి ప్రపంచ స్థాయి బాక్సింగ్‌ స్టార్‌గా ఆవిర్భవించాడు.

చౌతాలా ఆ పదవిని కోల్పోయాక మన బాక్సింగ్‌ క్షీణించింది. స్పైస్‌ జెట్‌ కొత్త యజ మాని అజయ్‌సింగ్‌ నేతృత్వంలో బాక్సింగ్‌ ఫెడరేషన్‌ను ఇప్పుడు పునర్వ్య వస్థీకరించారు. ఆయన దివంగత ప్రమోద్‌ మహాజన్‌కు పాత మిత్రుడు. ఇక కబడ్డీ నేడు తిరిగి వికసిస్తోంది. భారత్‌ కేంద్రంగా పలు అంతర్జాతీయ కబడీ లీగ్‌లు, రెండు ‘‘ప్రపంచ కప్‌’’లు జరుగుతున్నాయి. ఇరుపక్షాల తరఫున ఆడిన రాజకీయ రంగ క్రీడాకారుడు జనార్థన్‌సింగ్‌ గెహ్లాట్‌ భారత కబడ్డీని భార్య డాక్టర్‌ మృదులా భాదురియా చేతుల్లో ఉంచి... ప్రపంచ కబడ్డీ ఫెడ రేషన్‌ అధిపతి కావడమే మిగిలింది.

గొప్ప మెరుగుదలను కనబరుస్తున్న క్రీడలకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఎవరూ ఏవిధంగానూ లోధా పరీక్షకు నిలవలేరు. అయితే భారత అథ్లెటిక్స్‌ (వ్యాయామ క్రీడలు) ఫెడరేషన్‌ దీనికి అపవాదంగా కనిపిస్తుంది. దానికి నేతృత్వం వహిస్తున్నది మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొన్నవాడు, చాలా ఏళ్లపాటూ అతి వేగంగా పరుగెత్తే భారతీయునిగా నిలిచిన అగ్రశ్రేణి అథ్లెటిక్స్‌ క్రీడాకారుడు అదిల్లే సుమారివాలా. ఇంకా యువకునిగానే ఉన్న సుమారి వాలా లోధా పరీక్షను పూర్తిగా నెగ్గుతారు. అయితే భారత అథ్లెటిక్స్‌ రంగం చాలా వరకు గందరగోళంగానే ఉంది. తాజాగా ప్రవర్థిల్లుతున్న మరో క్రీడ హాకీ. భారత హాకీ ఫెడరేషన్‌ అధ్యక్షునిగా కేపీఎస్‌ గిల్‌ ప్రశంసలందుకు న్నారు. జాతీయ జట్టు ఎంపిక సందర్భంగా సెలక్షన్‌ కమిటీ సభ్యులు లంచాలు తీసుకుంటూ కెమెరాకు చిక్కారని గిల్‌ను సస్పెండ్‌ చేశారు. ఆ పని చేసినది సాక్షాత్తూ ఐఓఏకు చెందిన సురేష్‌ కల్మాడీ. కల్మాడీ ఐఓఏ, క్రీడా మంత్రిత్వశాఖ కలసి హాకీ ఇండియాను ఏర్పాటు చేశాయి.

ఇటీవలి వరకు దానికి ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రి యజమాని నరిందర్‌ బాత్రా నేతృత్వం వహించారు. ఆయన మార్గదర్శకత్వంలోనే భారత మహిళల, పురుషుల జట్లు ఆసియా చాంపియన్‌ షిప్‌లను తిరిగి సాధించాయి, ప్రపంచంలో 5–6 స్థానా లకు చేరాయి. 25 ఏళ్ల తర్వాత ప్రపంచ సీనియర్, జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లు మనకు దక్కాయి. బాత్రా ఇప్పుడు అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు (ఎఫ్‌ఐహెచ్‌) అధిపతి అయ్యారు. భారత హాకీని ఆయన, మాజీ జాతీయ హాకీ క్రీడాకారిణి మరియమ్మ కోష్కీకి అప్పగించారు.

హాకీ ఇండియా లీగ్‌ ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులను అందరినీ ఆకర్షిస్తోంది. హాకీ క్రీడాకారులకు కలనైనా ఊహించని ధరలు పలుకుతున్నాయి. మన ప్రతిభ పెంపొందుతోంది. క్రికెట్‌లో టీ20 లాగా   ఐదు జట్ల హాకీ రంగప్రవేశం చేయడంతో ఈ క్రీడ మరింతగా కనక వర్షం కురిపించనుంది.

కోర్టులు విప్పలేని చిక్కుముడి
ఈ గందరగోళపు సమాచారం నుంచి మనం నిర్ధారణలను ఏమైనా చేయ గలమా? వయసు, రాజకీయాలు, సంపద, క్రీడాపరమైన రికార్డు ఉండటం లేదా లేకపోవడం... వీటిలో ఏవైనాగానీ ఒక క్రీడలో సాఫల్యతకు హామీని స్తాయా? అలాంటప్పుడు అందుకు మీరు గీటురాళ్లను... అదీ కూడా ఒక్క క్రికెట్‌కే ఎలా నిర్ణయిస్తారు? భారతదేశపు అత్యంత విజయవంతమైన క్రీడ క్రికెట్టే. బీసీసీఐ పారదర్శకతలేనిదిగా, అవినీతిగ్రస్తమైనదిగా, తలపొగురు దిగా మారింది. అందులో పదవుల్లో ఉన్న పలువురి విషయంలో స్వీయ ప్రయోజనాల సంఘర్షణ సమస్య కూడా ఉన్నది. అయితే అది కూడా ఉన్నత శ్రేణి క్లబ్‌లన్నిటిలాగే ఇతరుల అసూయకు గురవుతోంది. న్యాయస్థానం, నిజాయితీపరులైన ముగ్గురు సుప్రీం న్యాయమూర్తులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? బీసీసీఐ ఆగ్రహం రేకెత్తించేటంతటి అహంకారంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించింది నిజమే.

కానీ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడమంటే ఆగ్రహంతో తుపాకీ పేల్చడం లాంటిదేనని సవినయంగా మనవి చేయాల్సి వస్తుంది. బీసీసీఐని ‘‘సంస్కరించడం’’ అనే చిక్కుముడి లోకి కోర్టు లేదా అది నియమించే కమిటీ తలదూర్చడం చేయనే కూడదు. రోగిని నిలువునా కోసేసి, కుట్లు వేయకుండా వదిలేయడం లాంటి ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. బోర్డు అత్యున్నతాధికార సంస్థ నాయకత్వాన్నే మార్చాలని బలవంతపెట్టే కంటే, నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, తగినంతగా చర్చించాక తీసుకున్న చర్యల నివేదికను కోరితే సముచితమై ఉండేది.

న్యాయమూర్తులు చాలా కష్టపడ్డారు. కానీ వారు ఆధునిక క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని విస్మరించారు. నేడు క్రీడ అంటే గ్లామర్, అట్టహాసం, డబ్బు, గోల, రంగులు, ప్రదర్శనాతత్వం, సమరో త్సాహపు పోటీతత్వం. బాణాసంచా జిలుగులు, చీర్‌ లీడర్లు వగైరా అన్నీ ఆటలో భాగమే. పెద్దమనుషుల ఆటగా పిలిచే క్రికెట్‌ అందుకు మినహా యింపు కాదు. వ్యాపార నైపుణ్యాన్ని వాణిజ్యీకరించినప్పుడు ఉద్వేగం విజ యం సాధిస్తుంది. భారత్‌లో ఐఏపీఎల్‌ అందుకు మార్గదర్శి. పైన పేర్కొన్న క్రీడలన్నిటి వికాసానికి కారణం ఐపీఎల్‌ దారిని అవి అనుసరించడమే.

-శేఖర్ గుప్తా
twitter@shekargupta

మరిన్ని వార్తలు