ఇక్కడ బుల్లెట్లకు కరువు లేదు..!

20 Jun, 2018 16:13 IST|Sakshi
బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ (ఫైల్‌ ఫొటో)

​కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జుల్పాయిగురి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిలీప్‌ ఘోష్‌.. ‘మా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై జరుగుతున్న దాడులను చూస్తున్నాం. బీజేపీ కార్యకర్తలపై పేలుతున్న ప్రతీ బుల్లెట్‌ను లెక్కిస్తున్నాం. వాటితోనే తిరిగి సమాధానం చెప్తాం. ఇక్కడ బుల్లెట్లకు కరువు లేదు. మేము తలచుకుంటే ప్రతిచోటును ప్రత్యర్థుల శవాలతో నింపేయగలమంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్న దిలీప్‌ ఘోష్‌.. ఇకపై హింసాకాండను సహించేది లేదంటూ బెంగాల్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కాగా, గతంలో కూడా బెంగాల్‌ పోలీసులు అధి​కార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక అటువంటి వారందరినీ విధుల నుంచి తొలగిస్తామంటూ దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడబోదంటూ ఆయన వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు