విదేశంలో పెండ్లి చేసుకున్న విరాట్‌ దేశభక్తుడా?

19 Dec, 2017 18:04 IST|Sakshi
విరాట్‌-అనుష్కల పెళ్లి ఫొటో

బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

గునా : విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మల పెండ్లిపై బీజేపీ కీలక నేత అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియాలో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, డబ్బులు సంపాదించి.. వాటిని ఇటలీలో ఖర్చుపెట్టిన విరాట్‌-అనుష్కలకు అసలు దేశభక్తి ఉందా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. జాతీయ క్రికెట్‌ జట్టు సారధిపై ఒక చట్టసభ్యుడు ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

మధ్యప్రదేశ్‌లోని గునా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న పన్నాలాల్‌ సంక్యా.. మంగళవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ దేశంలోనే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విక్రమాదిత్యుడు, ధర్మరాజు లాంటి పురాణ పురుషులు పెండ్లిళ్లు చేసుకున్నారు. మనందరం కూడా ఇక్కడే పెండ్లిళ్లు చేసుకున్నాం.. ఇకపైనా చేసుకుంటాం. మనలో ఎవరైనా విదేశాలకు వెళ్లి పెండ్లిళ్లు చేసుకున్నామా? మరి కోహ్లి మాత్రం ఆపని ఎందుకు చేసినట్లు? ఇక్కడ(ఇండియాలో) సంపాదించిన డబ్బును విదేశాల్లో ఖర్చుచేయడమేంటి?’ అని పన్నాలాల్‌ అన్నారు.

విరాట్‌-అనుష్కల పెండ్లి డిసెంబర్‌ 11న ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో.. 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న విరుష్కలు.. సన్నిహితుల కోసం డిసెంబర్‌ 21న ఢిల్లీలో, 26న ముంబైలో రిసెప్షన్‌ ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు