టీడీపీ గుండాలతో అల్లర్లు : బొత్స

27 Feb, 2020 19:21 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటనను రాజకీయానికి వాడుకోవాలని చూశారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో రెండు పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు చంద్రబాబు వచ్చారని అన్నారు. గురువారం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు తన ఉన్మాదాన్ని ప్రజలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పోలీసులను అగౌరవపరిచేలా మాట్లాడారని అన్నారు. టీడీపీ గుండాలతో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న వైజాగ్‌లో చంద్రబాబు అరాచకం సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఓ విధంగా.. లేకుంటే మరో విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం కలించాలన్నదే చంద్రబాబు దుర్బుద్ధి అని బొత్స విమర్శించారు. విశాఖలో అభివృద్ధి వద్దని చెబితే.. ప్రజలు నిరసన తెలపకుండా స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నైజం మార్చుకోనంతకాలం నిరసనలే ఎదురవుతాయని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబులా తాము ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేయడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే విశాఖలో భూకబ్జాలు జరిగాయని అన్నారు. తన వర్గం, బినామీల కోసం బాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని తెలిపారు. గత ఐదేళ్లు చంద్రబాబు అండ్‌ కో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ఉత్తరాంధ్ర ప్రజలు సమయమనంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐటీ, ఫార్మా రంగాలన్నీ దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదన్నారు. కాగా, పరిపాలనా రాజధానిగా విశాఖ ప్రకటనను వ్యతిరేకిస్తూ.. గురువారం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయిన సంగతి తెలిసిందే.

చదవండి : ‘చంద్రబాబును అడుగుపెట్టనివ్వం’

‘దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు’ 

పెల్లుబికిన ‍ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..

మరిన్ని వార్తలు