కరువు తాండవిస్తుంటే పొరుగు రాష్ట్రంలో రాజకీయాలా? 

9 Dec, 2018 04:23 IST|Sakshi

     సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట ధ్వజం

     ఏపీలో దోచుకున్న డబ్బును తెలంగాణ ఎన్నికల్లో వెదజల్లారు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో దోచుకున్న సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేశారని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో ఎలాగూ ఓడిపోతామని గ్రహించిన చంద్రబాబు ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌లో శాశ్వతంగా స్థిరపడదామని భావిస్తున్నట్లుగా ఉందన్నారు.  రూ. వంద కోట్లు వెచ్చించి హైదరాబాద్‌లో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని వ్యాఖ్యానించారు.  

మంత్రివర్గం భేటీలో కనీసం చర్చించారా? 
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర కరువు తాండవిస్తోదని, వర్షాభావ పరిస్థితు లు నెలకొన్నాయని, కేంద్ర బృందం కరువును పరిశీలించిందని గడికోట పేర్కొన్నారు. కేంద్రానికి ఇచ్చిన నివేదికలో వర్షపాతానికి సంబంధించి చంద్రబాబు తప్పుడు లెక్కలు చూ పించారని గడికోట విమర్శించారు.  మంత్రివర్గ సమావేశంలో కరువు గురించి చర్చించారా? అని గడికోట సూటిగా ప్రశ్నించారు.  

వృద్ధి రేటు బాగుందంటారా? 
రైతాంగానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన  లేదని గడికోట దుయ్యబట్టారు.   సైబరాబాద్‌ రూపశిల్పిని తానేనని, శంషాబాద్‌ విమానాశ్రయాన్ని కట్టింది కూడా  తానేనని తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని గడికోట విమర్శించారు. శంషాబాద్‌ విమానాశ్రయం, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే, ఔటర్‌ రింగురోడ్డు లాంటివన్నీ నిర్మించింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని గడికోట గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అదే పార్టీతో కలిసిపోవడం సిగ్గుచేటన్నారు. 

మరిన్ని వార్తలు