సాక్షి, విజయవాడ: రాజ్యాంగ ఆమోద దినోత్సం రోజున సీఎం చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జన్మభూమి కమిటీల పేరుతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు ఏర్పాటు చేయిస్తానన్న అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏమాయ్యాయని నిలదీశారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న చంద్రబాబుపై గవర్నర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దళితులకు చంద్రబాబు ఏవిధమైన మేలు చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.