సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి, ఎస్మా, పీడీ యాక్ట్ పేరుతో భయపెడుతున్నారని దుయ్యబట్టారు.ఆర్టీసీని ముంచింది ఈ ప్రభుత్వమేనన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ ప్రధానిని కలవడంలో తప్పు లేదన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నేతలు, వికారాబాద్ జిల్లా నుంచి పలువురు టీడీపీ, ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, చింతా సాంబమూర్తి, మనోహర్రెడ్డి, కె.మాధవి, ఎన్వీ సుభాష్, పొంగు లేటి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను తీర్చాలని, లేకపోతే బీజేపీ తరపున పోరాటాలకు సిద్ధం కావాలని లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల బీజేపీ సెల్ సమావేశంలో లక్ష్మణ్ ప్రసంగించారు.