బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..?

22 Jul, 2019 17:03 IST|Sakshi

బెంగళూర్‌ : కన్నడ రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై మంగళవారం సాయంత్రం ఓటింగ్‌ జరుగుతుందని భావిస్తుండగా అంతకు ముందే జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ సారథి, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన పదవికి రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. రెబెల్‌ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ శిబిరానికి చేర్చేందుకు గత రెండు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బలపరీక్షకు ముందే అస్త్రసన్యాసం చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్టు సమాచారం.

రాష్ట్ర గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ఇప్పటికే బలనిరూపణపై రెండు సార్లు డెడ్‌లైన్‌లు విధించినా స్పీకర్‌ వాటిని పట్టించుకోకపోవడం​మరోవైపు సోమవారం విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ తప్పదని స్పీకర్‌ సంకేతాలు పంపడంతో సీఎం పదవి నుంచి తప్పుకునేందుకే కుమారస్వామి మొగ్గుచూపుతున్నారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కుమార సర్కార్‌ను కూలదోసేందుకు బీజేపీ కుట్రపన్నిందని మంత్రి కృష్ణ బైరెడ ఆరోపించారు.

ఆపరేషన్‌ కమలంను అమలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఆరోపణలను తోసిపుచ్చిన బీజేపీ రాష్ట్ర చీఫ్‌ యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్‌లో కలహాలే సంక్షోభానికి కారణమని ఆరోపించారు. మైనారిటీలో పడిన సంకీర్ణ సర్కార్‌ బలనిరూపుణ చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు