అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి

29 Dec, 2019 01:35 IST|Sakshi

పార్టీ నేతలతో భేటీలో కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ కేడర్‌ను సమన్వయపరిచి అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసే విధంగా పనిచేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. శనివారమిక్కడ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో ఆయన భేటీ అయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. అన్ని వార్డులు, డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచే విధంగా పనిచేయాలని సూచించారు.

ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి ప్రభుత్వ పథకాలను మరోసారి గుర్తు చేస్తే కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌ గౌడ్, పువ్వాడ అజయ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాజిరెడ్డి గోవర్ధన్, హరిప్రియ నాయక్, నన్నపనేని నరేందర్, రాములు నాయక్, దివాకర్‌ రావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు