మోదీ ప్రమాణ స్వీకారానికి మమత గైర్హాజరు

29 May, 2019 14:51 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూటర్న్‌ తీసుకున్నారు. నరేంద్ర మోదీ ఈ నెల 30న రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ఆమె డుమ్మా కొడుతున్నారు. దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన మమతా.. రెండోరోజే మాట మార్చారు. మోదీ ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కావడం లేదంటూ మమతా బెనర్జీ ఈ మేరకు ఓ లేఖ రాశారు.

కాగా బెంగాల్‌లో జరిగిన హింసలో 54మంది బీజేపీ కార్యకర్తలు మరణించారంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆరోపణలు అవాస్తవాలని, బెంగాల్‌లో ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదని అన్నారు. వ్యక్తిగత కారణాలతో పాటు, కుటుంబ కలహాల వల్లే ఆ హత్యలు జరిగాయని మమత పేర్కొన్నారు. ఆ హత్యలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా బెంగాల్‌లో చనిపోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను కూడా ఆ పార్టీ ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడంపై మమత గుర్రుగా ఉన్నారు.

మరిన్ని వార్తలు