‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు’

16 Mar, 2020 13:50 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కరోనా కంటే పెద్ద వైరస్‌గా తయారయ్యారని మంత్రి అనిల్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. కరోనాను అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికలను నిలుపుదల చేయించారని మండిపడ్డారు. కరోనా పేరుతో ఎన్నికలు వాయిదావేసే ముందు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఏ అధికారులనైనా సంప్రదించారా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగుండాలని ఎన్నికలు వాయిదా నిర్ణయం తీసుకోవడం బాధాకరం అన్నారు. పార్టీ కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..
(చదవండి: ఎన్నికలు వాయిదాపై సుప్రీంలో పిటిషన్‌ దాఖలు)

‘చంద్రబాబుతో చర్చించి ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా పేరుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. టీడీపీ తరపున పోటీచేసేందుకు అభ్యర్థులే లేరు. అందుకే ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ను అడ్డం పెట్టుకున్నట్టుగా ఉంది. ఎన్నికల కమిషన్‌కు విచక్షణాధికారం ఉందని.. విచక్షణ కోల్పోయి నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కడిది. 45 రోజులు ఎన్నికల కోడ్ ఉందని చెప్తూ చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు.

ఎన్నికల కమిషనర్ కుమార్తె గతంలో ఈడీబీలో పని చేశారు. దానికి ప్రతిఫలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా చెప్పాలి. దీనికోసం రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెడతారా. ఎన్నికలు ఆపేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం రమేష్‌కుమార్‌కు ఎక్కడిది. ఫ్రాన్స్ లో 5500 కరోనా కేసులు, 127 మంది చనిపోతే కూడా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ అంత దారుణమైన పరిస్థితి లేదు కదా. ఎన్నికలు ఆపేయాలనే చంద్రబాబు నీచమైన ఎత్తుగడ వేశారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం’అని మంత్రి పేర్కొన్నారు.
(చదవండి: ‘అలా అయితే ముఖ్యమంత్రి ఎందుకు?’)

మరిన్ని వార్తలు