హంతకులకు కేంద్ర మంత్రి సన్మానం!

8 Jul, 2018 02:14 IST|Sakshi

హజారీబాగ్‌: కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా వివాదంలో చిక్కుకున్నారు. గతేడాది ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు శుక్రవారం ఆయన పూల మాలలు వేసి సన్మానించారు. ప్రతిపక్షాలు మంత్రి చర్యను ఖండించాయి. నిందితులకు మిఠాయిలు తినిపించిన జయంత్‌ సిన్హా..న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, తప్పకుండా న్యాయం జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు.

తన నియోజకవర్గానికి చెందిన వారంతా విడుదలవడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి న్యాయం జరిగేలా చూడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తమకు లాయర్‌ను ఏర్పాటుచేసిన మంత్రికి 8 మంది నిందితులు ధన్యవాదాలు తెలిపారు. విద్వేషపూరిత, విభజన రాజకీయాలు సమాజాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. జయంత్‌ సిన్హా తీరు హేయమైనదని జేఎంఎం నాయకుడు హేమంత్‌ సోరెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు