40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి మాట్లాడటం చేతకాదా?

8 Nov, 2019 15:43 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, కాకినాడ: అన్ని హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  నెరవేరుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. శుక్రవారం కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యాబోధన బలోపేతం అవ్వాలనే ఉద్దేశంతోనే  ప్రభుత్వం  ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో తెలుగును ఎంత నిర్లక్ష్యం చేశారో అందరికి తెలుసునన్నారు. తెలుగు పై అంత అభిమానం ఉన్న చంద్రబాబు.. లోకేష్,  దేవాన్ష్ ను ఎందుకు తెలుగు మీడియంలో చదివించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

సీఎం జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు కాబట్టే చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారన్నారు. ప్రజల తీర్పుతో ఖాళీగా ఉండి.. చంద్రబాబు, లోకేష్‌లు వీడియో గేమ్స్‌ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు మాట్లాడటం రావడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గురించి ఎలా మట్లాడాలో తెలుసుకోవాలని, సంయమనం పాటించాలని హితవు పలికారు. నాలుగు నెలలకే మీరు తట్టుకోలేకపోతే ఎలా అని.. ఇంకా నాలుగున్నరేళ్ల పాలన ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తు పెట్టుకోవాలన్నారు.  సీఎం, మంత్రులు, అధికారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కన్నబాబు సూచించారు.

మరిన్ని వార్తలు