సోనియా లక్ష్యంగా ‘అగస్టా’ కుట్ర

20 Jul, 2018 04:11 IST|Sakshi

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ విమర్శలు

న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని ఇరికించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇందులోభాగంగా సోనియాకు వ్యతిరేకంగా తప్పుడు నేరాంగీకార వాంగ్మూలం ఇవ్వాలని ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్‌ మిచెల్‌ను విచారణ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని వెల్లడించింది. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు ప్రధాని మోదీ విచారణ సంస్థలను వాడుకుంటున్నారంది.

ఈ విషయమై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు తప్పుడు ఆధారాల సృష్టికి సాక్షాత్తూ ప్రధానమంత్రి పూనుకోవడం భారత దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నడూ సంభవించలేదు’ అని మండిపడ్డారు. ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా ఉన్న క్రిస్టియన్‌ మిచెల్‌ను దుబాయ్‌ పోలీసులు రెండ్రోజుల క్రితం అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. శిక్ష నుంచి తప్పించుకునేందుకు సోని యాకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని మిచెల్‌ను విచారణ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని అతని లాయర్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు