రైల్వేజోన్‌పై అభ్యంతరాలను అనుమానించాలి

2 Mar, 2019 04:00 IST|Sakshi

సీఎం చంద్రబాబుపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ధ్వజం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తే సీఎం చంద్రబాబు అభ్యంతరాలు లేవనెత్తడాన్ని అనుమానించాల్సి ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కేవలం రాజకీయ కారణాలతోనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా? అని నిలదీశారు. గత ఐదేళ్లలో రైల్వే సాధించిన ప్రగతిపై పీయూష్‌ గోయల్‌ శుక్రవారం ఢిల్లీలో పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా రైల్వేజోన్‌ ఏర్పాటుపై ఉన్న అభ్యంతరాల గురించి మీడియా ప్రశ్నించగా మంత్రి స్పందిస్తూ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రం గా మండిపడ్డారు. ‘‘చంద్రబాబు కేవలం రాజకీయ కారణాలతోనే రైల్వే జోన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా? ఆయనకు ప్రజాసంక్షేమం పట్టదా? దీనిపై ఆయన్నే ప్రశ్నించాల్సిన అవసరముంది. రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనకు ముందు నాకు లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంపై అనుమానించాల్సిన అవసరం ఉంది. ఆయనకు ప్రజాసంక్షేమం పట్టదు కాబట్టి జోన్‌ ఏర్పాటుపై ఆయన అయిష్టంగానే ఉంటారు’’అని కేంద్రమంత్రి అన్నారు.  

మరిన్ని వార్తలు