కాంగ్రెస్‌కు చివరి అధ్యక్షుడు రాహుల్‌

18 Jan, 2019 11:01 IST|Sakshi

జైపూర్‌ : కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై రాజస్తాన్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ఞాన్‌దేవ్‌ అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీని.. మొఘల్‌​ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చడమే కాక.. కాంగ్రెస్‌ సామ్రాజ్యం అతి త్వరలో అంతం కానుందని జోస్యం చెప్పారు. ఔరంగజేబు మొఘల్‌ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తి.. అలానే రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌కు చివరి అధ్యక్షుడన్నారు. అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అభిప్రాయపడ్డారు.

‘రాహుల్‌ గాంధీ తనును తాను హిందువుగా చెప్పుకుంటూ.. జంధ్యం ధరిస్తానని అంటున్నారు. మరి ఆయన చేత జంధ్యం ధరింపజేసిన బ్రాహ్మణుడి పేరు చెప్పగలరా’ అంటూ అహుజా ప్రశ్నించారు. త్వరలో రాజస్తాన్‌లో జరగబోయే రామ్‌గఢ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే అహుజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆవులను దొంగతనం చేసే వారిని ఉగ్రవాదులంటూ గతంలో విమర్శించారు.

మరిన్ని వార్తలు