‘టీడీపీ తానా సభల్లో మాత్రమే మిగులుతుంది’

14 Jul, 2019 14:06 IST|Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ కేవలం తానా సభల్లో మాత్రమే మిగులుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పనైపోయిందని అన్నారు. గుంటూరులో ఆదివారం బీజేపీ ఆఫీస్‌ బేరర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాంమాధవ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంమాధవ్‌ మాట్లాడుతూ.. బీజేపీ అంటే ఒక రాజకీయ సంస్కృతి అని తెలిపారు. భిన్నమైన రాజకీయ సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోదీ ఆద్యుడని పేర్కొన్నారు.

అన్ని పార్టీల వారు బీజేపీలో చేరేందుకు వస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో బలపడేందుకు చాలెంజింగ్‌గా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీ అనే నమ్మకం  ప్రజల్లో కలిగిందని తెలిపారు. ఏపీ ప్రజలకు కూడా ఆ నమ్మకం కలిగించాలని అన్నారు. అవినీతి, అక్రమాలకు టీడీపీ నిలయంగా మారిందని మండిపడ్డారు. 2024 నాటికి ఏపీలో బీజేపీ అధికార పార్టీ దిశగా ఎదగాలని ఆకాక్షించారు. 25 మందిని కూడా స్వయంగా సభ్యత్వం చేయించని వారికి ఏ పదవి ఆశించే అర్హత లేదని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు