సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలనుంచి ఇప్పటిదాకా దోచుకున్న సొమ్ముతో విదేశాలకు పారిపోవడానికే మంత్రి కేటీఆర్ రాజకీయ సన్యాసం అంటున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్కు జైలు భయం పట్టుకుందన్నారు. దోపిడీ చేసిన సొమ్మును దాచుకోవడానికే విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటిదాకా కేటీఆర్ చేసిన విదేశీ పర్యటనలు ఎన్ని, వాటికోసం చేసిన ఖర్చు ఎంత, తెచ్చిన పెట్టుబడులు ఎన్నో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘టీఆర్ఎస్ ఒక లత్కోరు పార్టీ, దానిని మోసకారుల కుటుంబం నడుపుతోంది’అని విమర్శించారు. మిషన్ భగీరథ కింద ఇప్పటిదాకా ఎన్ని గ్రామాలకు నీళ్లు అందాయో చెప్పాలన్నారు. అలాగే ఇప్పటిదాకా ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తిచేశారని ప్రశ్నించారు.