ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే రేవంత్ ధ్వజం
మిడ్జిల్: అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు తన ఇంటిని బంగారుగా మార్చుకున్నాడని ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఆరోపించారు. మిడ్జిల్లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ పునరేకీకరణ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. లోక్సభలో ఒక సీటే ఉన్న టీఆర్ఎస్తో తెలంగాణ రాలేదని, సోనియాగాంధీ దయతోనే వచ్చిందని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ పతనానికి ఇక్కడి నుంచే నాంది పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో 90 శాతం ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో పూర్తయితే, ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు కొత్త బిచ్చగాళ్లలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
పెట్టుబడి పెట్టిన నన్నే మరిచావా?
మంత్రి కేటీఆర్ ట్వీటర్లో తాను ఎవరో తెలియదని చెప్పడంపై రేవంత్రెడ్డి మండిపడ్డారు. బుద్ధి మందగించిన వారికి తండ్రి ఎదురైనా అంకుల్ అని అంటారని, అప్పట్లో టీఆర్ఎస్కు పెట్టుబడి పెట్టిన తనను మర్చిపోయారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళామంత్రులు లేకుండా అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా సభకు కేటీఆర్ వెళ్లాడంటేనే ఆయన స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.