రుణమాఫీ, నిరుద్యోగభృతి సాధ్యం కావు: పల్లా

18 Jul, 2018 01:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్‌ నేతలు ప్రకటిస్తున్న రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలు ఆచరణ సాధ్యం కావని ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గట్టెక్కడానికి కాంగ్రెస్‌ నేతలు ప్రయోగిస్తున్న ఆపదమొక్కులను ప్రజలు నమ్మరన్నారు.

ఐదు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌నేతలు ఆస్తులు, ఆకారాలు, అహంకారాన్ని తప్ప బుర్రను పెంచుకోలేదని విమర్శించారు. సంక్షేమపథకాలతో సీఎం కేసీఆర్‌ ప్రతిష్ట పెరిగితే వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రారంభమైన కాంగ్రెస్‌ పతనం 2019 నాటికి పూర్తిగా కనుమరుగవుతుందని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వందసీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తుందని జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు