ఐదుగురు విద్యార్థులు.. ఆరుగురు ఉపాధ్యాయులు!

18 Jul, 2018 01:49 IST|Sakshi
విద్యార్థులు లేక చెట్ల కింద కూర్చున్న టీచర్లు

గోదావరిఖని: ఆ పాఠశాలలో చదివేది ఐదుగురు విద్యార్థులు.. చదువు చెప్పేది మాత్రం ఆరుగురు టీచర్లు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నెలకొన్న పరిస్థితి ఇది. సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా ఈ గ్రామం పూర్తి కనుమరుగు కానుండటంతో చాలా మంది గ్రామస్తులు చుట్టు పక్కల గ్రామాలకు వలసవేళ్లారు.  ఉన్న కొందరు పిల్లలనూ  5 కిలోమీటర్ల దూరంలోని చందనాపూర్‌ పాఠశాలలో చదివిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలకు వచ్చే వారే కరువయ్యారు. పిల్లలందరూ టీసీలు తీసుకెళ్లగా చివరకు ఐదుగురు విద్యార్థులే మిగిలారు.

విద్యార్థుల సంఖ్య తగ్గిన విషయాన్ని కౌన్సెలింగ్‌లో పొందుపర్చక పోవడంతో వెబ్‌కౌన్సెలింగ్‌ యథావిధిగా కొనసాగింది. ఇందులో పాఠశాలకు ప్రభుత్వం ఆరుగురు టీచర్లను కేటాయించింది. బదిలీపై ఎంతో సంతోషంగా వచ్చిన టీచర్లలకు ఇక్కడి పరిస్థితి చూసి ఇబ్బందిగా ఫీలవుతున్నారు. చివరకు టీచర్లంతా ఎంఈవో వద్దకు వెళ్లి బోధన కోసం వేరే పాఠశాలకు డిప్యూటేషన్‌ చేయాలని కోరడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు